byసూర్య | Mon, Oct 25, 2021, 04:21 PM
హైదరాబాద్: పోడు భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటమారుస్తూ ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ధ్వజమెత్తారు. పోడు భూముల విషయంలో చట్టం ఉన్నప్పటికీ దానిని సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్లో కేంద్ర మాజీ మంత్రి బలరామ్నాయక్తో కలిసి పోడు భూముల విషయంపై కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోడుభూములపై కోనేరు రంగారావు కమిటీని వేసిందని.. ఆ కమిటీ నివేదిక అన్ని రకాల భూములకు మార్గదర్శకాలు రూపొందించిందని కోదండరెడ్డి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోడు భూముల వ్యవహారంపై అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.