byసూర్య | Mon, Oct 25, 2021, 03:40 PM
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనే విషయం అంచనా వేయడం చాలా కష్టం. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ వ్యూహాలను అంచనా వేయలేక ప్రతిపక్షాలు అనేకసార్లు బోల్తా పడుతుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముందస్తు ఎన్నికల విషయంలోనూ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయ్యారు. మరోసారి కూడా ఆయన అలాంటి ప్రయోగమే చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ వాదనను బలంగా వినిపిస్తున్నారు. కేసీఆర్ (CM KCR)వచ్చే ఏడాది ముందస్తు ఎన్నికలకు వెళతారని కొన్ని నెలల కిందటే వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. దీనిపై రాజకీయవర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. నిజంగానే మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు(Early Polls) వెళతారా ? అని నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
స్వయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సైతం తమ అధినేత మనసులో మరోసారి ముందస్తు ఆలోచన ఉందా ? అని సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై ఇటీవల జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తేల్చేశారు. అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని.. ప్రభుత్వం పూర్తిస్థాయి గడువు వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. రాబోయే కాలంలో తమ ప్రభుత్వం అనుకున్న పనులను పూర్తి స్థాయిలో చేస్తామని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చ ముగిసినట్టే అని అంతా భావించారు.
కానీ తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి ముందస్తు ఎన్నికలపై తన అంచనాలను, తనకు ఉన్న సమాచారాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు తరువాత సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని జోస్యం చెప్పారు. ఆ తరువాత డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. గుజరాత్ అసెంబ్లీతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలన్నది కేసీఆర్ ప్లాన్ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని కేసీఆర్ స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పినా.. రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ అధినేతకు ముందస్తు ఆలోచన ఉందని మళ్లీ బాంబు పేల్చారు. ఈసారి మరింత సమాచారం ఇస్తూ.. గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండొచ్చని అంచనా వేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి అంచనా నిజమవుతుందా లేదా అన్న విషయం పక్కనపెడితే.. ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు మరోసారి ముందస్తు టెన్షన్ పెట్టినట్టే కనిపిస్తోంది.