byసూర్య | Mon, Oct 25, 2021, 11:19 AM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఈ పరీక్షలో తప్పిన వారికి పరిస్థితులు అనుకూలిస్తే మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని లేదంటే వార్షిక పరీక్షల సమయంలో మరోసారి పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్. కరోనా ప్రభావంతో ఈసారి పరీక్ష కేంద్రాలు పెంచామని..భౌతిక దూరం పాటించేలా విద్యార్థులు సీట్లు కేటాయించామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు అధికారులు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయ్. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించి లోపలికి అనుమతిస్తారు. ఎవరికైనా అధిక దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించినా వారికి ప్రత్యేక గది కేటాయించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో రెండు ఐసోలేషన్ గదులను కేటాయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న ఉన్న కారణంగా.. ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను మరుసటి రోజు నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.