byసూర్య | Thu, Jun 10, 2021, 04:30 PM
అరేబియా సముద్రంలో నైరుతి గాలులు బలపడ్డాయి. దీంతో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో తుని వరకు, తెలంగాణలో భద్రాచలం, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు ఉత్తర బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి. ఇదే సమయంలో తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావాలతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం పశ్చిమ గాలుల ప్రభావం కాస్త తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33-39 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సీమ, దక్షిణ కోస్తాలో కొద్దిగా ఎండ, వేడి గాలులు ఉండగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలపడి చురుగ్గా మారనున్నాయి.