byసూర్య | Thu, Jun 10, 2021, 11:00 AM
అందరూ అనుకుంటున్నట్టుగానే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దయ్యాయి. సీబీఎ్సఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యా శాఖ కార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ విద్య కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనతో బుధవారం ఆమె ఇంటర్ బోర్డు కార్యాలయంలో సమావేశమయ్యారు. విద్యాశాఖకు సంబంఽధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా ఫలితాలు ఉంటాయని, దీనికోసం అధికారులతో ఓ కమిటీని నియమిస్తామని వెల్లడించారు.
కమిటీ సూచించిన మార్గదర్శకాల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అయితే, పరీక్ష రాయాలనుకున్నవారికి కరోనా తగ్గుముఖం పట్టాక పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబిత తెలిపారు. కాగా.. ఫలితాల కోసం ఉన్నతాధికారులతో కమిటీని గురువారం ప్రకటించే అవకాశాలున్నాయి. నిబంధనల రూపకల్పన,మార్కులు కేటాయింపు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తిచేసి ఈ నెలలోనే ఫలితాలను ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో.. వరుసగా రెండో ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా ఉత్తీర్ణులు కానున్నారు. ఫస్టియర్లో ఫెయిలైన విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అంటే.. అలాంటి విద్యార్థులకు మాత్రం కనీస ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు కేటాయించి ఉత్తీర్ణులుగా ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. ఇంటర్ సెకండియర్ ఫలితాలపై ఏర్పాటుకానున్న కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోనుంది.