byసూర్య | Wed, Jun 09, 2021, 11:50 AM
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణి.. ఆసుపత్రి బయటే ప్రసవించింది. ప్రభుత్వ ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం మీర్జాపూర్లో చోటుచేసుకుంది. బుధవారం న్యాలకల్ మండల పరిధిలోని ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలవడంతో.. ఆమె కుటుంబసభ్యులు మీర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం 7.30 గంటలకు మీర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి తలుపులు తెరవలేదు. దీంతో నొప్పులు తీవ్రం కావడంతో ఆసుపత్రి బయటే బంధువులు ఆమెకు ప్రసవం చేశారు.
అనంతరం అంబులెన్సులో తల్లి, శిశువును జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని బంధువులు వెల్లడించారు. అయితే.. ప్రభుత్వ ఆసుపత్రి 24 గంటలపాటు తెరిచి ఉంచాలి. కానీ తాళాలు వేస్తే ఎలా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ సంఘటన తెలుసుకున్న అనంతరం వైద్యలు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం.