byసూర్య | Mon, Jun 07, 2021, 02:45 PM
వికారాబాద్ జిల్లా దోమ మండలం, పాలెపల్లిలోని వరికొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యాన్ని రోడ్డుపై కుప్పగా పోసి నిప్పు పెట్టి తగలబెట్టారు. వెంటనే తమ ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపారు. రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10, 15 రోజులుగా ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా ఉంచామని, వరి ధాన్యం మొలకెత్తుతున్నాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకోగా ఓ రైతు ఎస్ఐ కాళ్లపైపడి రోధిస్తూ.. తమను ఆదుకోవాలని వేడుకున్నాడు. ప్రతి 40 కేజీల బస్తాకు తరుగు పేరుతో రెండు నుంచి ఐదు కిలోల వరకు తగ్గిస్తున్నారని, ఇలా అయితే తమకు ఏం మిగులుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తానేమి చేయలేనని, పై అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నానని ఐకేపీ సెంటర్ నిర్వాహకుడు చేతులెత్తేశాడు.