byసూర్య | Mon, Jun 07, 2021, 12:32 PM
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పార్టీ పేరుతో పాటు పార్టీ పెట్టబోయే తేదీనిసైతం నేడు ఒక ప్రకటన ద్వారా షర్మిల ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి రోజైన జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయింది. షర్మిల తన కొత్త పార్టీని 'వైఎస్సార్ టీపీ'గా రిజిస్ట్రేషన్ చేయించారు. పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వైఎస్ సతీమణి విజయలక్ష్మి రాసిన లేఖను వైఎస్సార్ టీపీ ఈసీకి సమర్పించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్ళీ తీసుకురావడం కోసం, ఆయన ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్సార్ గారు అందించిన సంక్షేమం.. ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా 'వైఎస్సార్ తెలంగాణ' పార్టీ పెట్టాలనుకున్నారు షర్మిల.
'వైఎస్సార్ తెలంగాణ' పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వారి అఫిషియల్ వెబ్సైట్లో పార్టీ పేరు పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30వ తేదీనే ఎలెక్షన్ కమిషన్ తెలిపింది. ఇప్పటి వరకూ ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటే అనుమతుల ప్రాసెస్ పూర్తయినది అనుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా నుంచి అఫిషియల్గా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీకు ప్రకటిస్తాం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు వైఎస్ విజయమ్మ గారి సమ్మతితోటి .. వారి ఆశీస్సుల తోటే జరిగింది కాబట్టి ఇతరులకు అభ్యంతరం ఉంటుంది అని మేము అనుకోవడం లేదు. రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు జులై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను.. కార్యక్రమాలను మేము ఇప్పటికే ప్రారంభించాం'' అని రాజగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు.