byసూర్య | Sat, Jun 05, 2021, 09:25 AM
ఈ నెల 3వ తేదీన దక్షిణ కేరళను తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ అంతటా విస్తరించాయి. ఆ ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడు, కర్నాటకలో కొంతభాగానికి నైరుతి విస్తరించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు, మూడు రోజుల్లో దక్షిణ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్నం ప్రకటించారు. నైరుతి దిశ నుంచి దక్షిణ తెలంగాణకు ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో 2021, జూన్ 05వ తేదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు రుతుపవనాలు టచ్ చేశాయి. అవి క్రమంగా ఆయా రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. 2,3 రోజుల్లో కర్నాటక, తమిళనాడు, లక్షద్వీప్లోని అన్ని ప్రాంతాలకు, మహారాష్ట్ర, గోవా, మధ్య అరేబియా సముద్రం, ఈశాన్య., మధ్య బంగాళాఖాతం, ఈశాన్య భారత్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.