byసూర్య | Fri, Jun 04, 2021, 11:20 AM
కరోనా పుణ్యమా అని ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్లో మరణాలు సంభవించాయి. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం చూస్తే అలాగే అనిపిస్తోంది. మై జీహెచ్ఎంసీ యాప్లో ప్రభుత్వం నమోదు చేసిన డెత్ సర్టిఫికేట్ల వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ నగరం కరోనా విలయంలో చిక్కుకుని విలవిల్లాడుతోందా? అన్న విషయాలు తేటతెల్లమవుతున్నాయి.
2018 నుంచి 2020 వరకు మరణాల నమోదులో 5 నుంచి 10 శాతం వరకు హెచ్చుతగ్గులు ఉండగా ఈ ఏడాది మూడు రెట్లు అధికంగా అంకెలు కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో నిత్యం 130 నుంచి 160 మరణాలు నమోదు అవుతుంటాయి. అప్పుడప్పుడు ఈ సంఖ్య 2 వందలు దాటుతుంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ చివరి.. మే మొదటి వారంలో నమోదు అనూహ్యంగా పెరిగింది. రోజూ 350 నుంచి 400లకుపైగా రిజిష్టర్ అయ్యాయి. కొన్ని రోజుల్లో 450 వరకు నమోదయ్యాయి. నమోదైన మరణాల్లో దాదాపు 95 శాతం ఆస్పత్తుల్లో సంభవించినవే. ఇళ్లల్లో చనిపోయినవారి వివరాలు కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇవన్నీ గాంధీ, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్న సర్కిళ్లలోనివి కావడం గమనార్హం. దీంతో ఆ మరణాల్లో మెజారిటీ కరోనా సంబంధిత కారణాలవల్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది