byసూర్య | Fri, Jun 04, 2021, 10:28 AM
తెలంగాణలో లాక్డౌన్ అమలులో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సడలింపు సమయం తర్వాత రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. అనవసరంగా బయటికి వచ్చిన వారిని అరెస్టులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారిని, ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాలీబాల్ ఆడుతున్న యువకులను పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా ఆయా కాలనీల్లో షాపు యజమానులను సైతం స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. రోడ్లపై తిరుగున్న యువకులకు ఎక్కడ దొరికిన వారికి అక్కడే కరోనా టెస్టులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, లేనట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎవరైనా మళ్లీ బయట కనిపిస్తే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తామని హెచ్చరించారు.