byసూర్య | Thu, Jun 03, 2021, 04:16 PM
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రేపు కీలక ప్రకటన చేయనున్నారు. తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగింపు.. తనపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్కు దూరమైన ఈటల రాజేందర్.. బీజేపీకి దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై ఓ నిర్ణయానికి వచ్చిన ఈటల రాజేందర్.. రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. నిజానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సమైన జూన్ 2న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ భావించారు. అయితే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సమాలోచనలు జరిపేందుకు కొంత సమయం పట్టడంతో.. ఈ నెల 4న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు బీజేపీలో చేరే విషయంలోనూ ఈటల రాజేందర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రేపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్.. మరో వారం తరువాత ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీలో చేరికపై సముఖత వ్యక్తం చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన ఈటల రాజేందర్.. ఆయనతో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీలో చేరితే తనకు లభించే ప్రాధాన్యత ఏంటనే అంశంపై కూడా ఆయన బీజేపీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. అయితే ఎలాంటి కండీషన్లు లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు.