byసూర్య | Fri, Apr 09, 2021, 01:23 PM
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరుపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా రాములు(39) రెండున్నర ఎకరాలు మిర్చి పంట సాగు చేశాడు. అయితే పంట పెట్టుబడికి అప్పులు చేయగా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో పాటు ఎండిపోవడంతో మనస్థాపానికి గురైన రాములు పంట చేనువద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య పద్మతో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సంఘటన స్థలానికి స్థానిక సర్పంచ్ అజ్మీర నాగేశ్వరం చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. కారేపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఇల్లందు ఆసుపత్రికి తరలించారు.