byసూర్య | Fri, Apr 09, 2021, 12:58 PM
మహబూబ్నగర్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవిడ్ టీకా తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు. మంత్రితోపాటు ఆయన తల్లి శాంతమ్మ, సోదరుడు శ్రీకాంత్ గౌడ్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకాపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
దేశవ్యాప్తంగా రెండో విడుత వ్యాక్సినేషన్ కార్యక్రమం మార్చి 1న ప్రారంభమయ్యింది. ప్రస్తుతం 45 ఏండ్లు పైబడినవారందరికీ టీకా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,83,208 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇందులో 14,99,801 మంది వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకోగా, 2,83,407 మంది రెండో డోసు తీసుకున్నారు.