byసూర్య | Fri, Apr 09, 2021, 12:55 PM
హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కోరారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. కొవిడ్ వ్యాక్సిన్, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ...దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. ప్రభుత్వ సూచనల మేరకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. టీకా వేయించుకున్న వారు నిర్లక్ష్యం వహించవద్దన్న కిషన్రెడ్డి, టీకా ఉత్సవ్పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని తెలిపారు. ఎక్కడా వ్యాక్సిన్ లోటు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వ్యాక్సిన్ తరలింపులో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని, దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.
''సీరం, భారత్ బయటెక్ సంస్థలు అద్భుతంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. మన దేశంతో పాటు మరో 58 దేశాలకు భారత్ నుంచి వ్యాక్సిన్ సరఫరా అవుతోంది. ముందుగా మన దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించేందకు అవకాశం ఉన్నన్ని డోసులు అందుబాటులో ఉంచుతున్నాం. ప్రధాని కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు... నేను కొవిషీల్డ్ టీకా తీసుకున్నాను. ఏ వ్యాక్సిన్ అయినా మంచిగానే పనిచేస్తోంది. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారు. ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రాన్ని గాంధీలో ఏర్పాటు చేశారు. కొవిడ్ రోగులతో కలిసే అవకాశం లేకుండా ఆసుపత్రి వార్డులకు కొంత దూరంగా ఉండేలా కేంద్రం ఏర్పాటు చేశారు. ఎక్కడా వ్యాక్సిన్ లోటు లేదు'' అని కిషన్రెడ్డి వెల్లడించారు.