byసూర్య | Wed, Apr 07, 2021, 02:38 PM
హైదరాబాద్: ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల కొంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పెరుగుతోందని విమర్శించారు. స్వయంగా ఒక మంత్రి ఫోన్లో మాట్లాడి తన వాటా ఏది అంటూ బెదిరిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యువరాజుకు పట్టాభిషేకం విషయంలో మునిగిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ యువరాజు సన్నిహితులు వివిధ కేసులలో చిక్కుకున్న విషయం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ పాలన ధృతరాష్ట్రుడిని తలపిస్తోందన్నారు. హత్య రాజకీయాలు, దొంగఓట్లు, డ్రగ్ కేసులలో మంత్రి కేటీఆర్ సన్నిహితులు ఉన్నారని విమర్శించారు. నాగార్జున సాగర్లో మద్యం ఏరులై పారుతుందని ప్రభాకర్ ఆరోపించారు.