byసూర్య | Wed, Apr 07, 2021, 12:23 PM
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ విషయంలో జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కరోనా నిర్దారణ పరీక్షలను రెండింతలు చేయాలని, ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను 1000కి పైగా పెంచాలన్నారు. రోజుకు 1.25 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, అన్ని జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వీకెండ్ లో, సెలవు దినాలలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గరాదని స్పష్టం చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలు వారంలోని అన్ని రోజులలో తప్పనిసరిగా పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పాజిటివ్ వ్యక్తి యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం న్యూ టెస్టింగ్ యాప్ ను ఉపయోగించాలని ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు సూచించారు.