byసూర్య | Sat, Apr 03, 2021, 12:36 PM
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కరోనా కారణంగా బంద్ అయిన స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రీ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఆన్లైన్ క్లాసులు విన్న పాఠశాల విద్యార్థులకు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుండటం, స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మార్చి 23వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు మళ్లీ ఆన్లైన్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మే 17 నుంచి 26వ తేదీ వరకు పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది. అంటే ఇప్పటి నుంచి పరీక్షలకు కేవలం 35 రోజులు మాత్రమే గడువు ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 44 పని దినాల్లో మాత్రమే ప్రత్యక్ష తరగతులు నడిచాయి. విద్యార్థులకు బోధించాల్సిన సిలబస్ ఇంకా మిగిలే ఉంది. ఆన్లైన్ తరగతులు అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కనీసం పదో తరగతి విద్యార్థులకు అయినా సాధ్యమైనన్ని ఎక్కువ ప్రత్యక్ష తరగతులు జరిగేలా చూడాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8వ తేదీ నుంచి క్లాస్లు ప్రారంభించి పరీక్షల వరకు అంటే 28 రోజుల పాటు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.