byసూర్య | Sat, Apr 03, 2021, 11:30 AM
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో శుక్రవారం ముగ్గురు తమ నామినేష న్లు ఉపసంహరించుకున్నారు. మహాజన సంఘర్షణ సమితి(ఎంఎ్సపీ) తరఫున నామినేషన్ వేసిన గొడపర్తి జానకిరామయ్య, ముదిగొండ వెంకటేశ్వర్లుతోపాటు స్వతంత్ర అభ్యర్థి రావులపాటి రవిశంకర్ కూడా ఉపసంహరించుకున్నారు. ఎంఎ్సపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ, ఆడెపు నాగార్జునను అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత మంద కృష్ణమాదిగ ప్రకటించడంతో మిగతా ఇద్దరు ఉపసంహరించుకున్నారు.
ఉప ఎన్నికకు 77 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వివిధ కారణాలతో 17 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. శుక్రవారం ముగ్గురు ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతానికి 57మంది బరిలో ఉన్నారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. చివరిరోజు ఎంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉపఎన్నిక ఈవీఎంల ద్వారా నిర్వహిస్తున్నందున 15 మంది అభ్యర్థులకు మించి పోటీలో ఉంటే అదనంగా ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.