byసూర్య | Thu, Apr 01, 2021, 10:06 AM
నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలోని కోసి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ చాటింగ్ కు ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఊరు పేరు తెలియని ఓ యువతితో ఫోన్ లో వీడియో చాట్ చేశాడు. యువకుడితో వీడియో చాట్ తరువాత ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి భయపడిన యువకుడు గ్రామంలోని పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతితో మాట్లాడిన నగ్న వీడియో టేప్ లు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు శ్రీకాంత్ హైదరాబాద్ లోని పంజాగుట్ట క్షత్రియ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.