byసూర్య | Wed, Mar 31, 2021, 11:48 AM
ఓ 70 ఏళ్ల వృద్ధురాలు అనుమానాస్పదరీతిలో మృతిచెందగా.. ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.జూలియట్ ఆంథోనీ(71) అనే అవివాహిత హైదరాబాద్ లోని బొగ్గులకుంటలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి రైల్వేలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఆయనకు వచ్చే పెన్షన్ తోనే జూలియట్ ఆంథోనీ జీవనం సాగిస్తోంది. ఆమెకు వయసు మీదపడిపోవడంతో బాగోగులు చూసుకునేందుకు ఓ వ్యక్తి కావాలని.. ఎంబీయే చదివి ఖాళీగా ఉంటున్న ఆమె బాబాయి కొడుకు 24 ఏళ్ల జోసెఫ్ రిచర్డ్ ను తన ఇంటికి తీసుకొచ్చుకుంది. అతడు ఆమెకు అవసరమైన పనులను చేసి పెట్టేవాడు. ఏటీఎం నుంచి డబ్బులను కూడా డ్రా చేసి తీసుకొచ్చేవాడు. అలా ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును చూసిన రిచర్డ్ ఆమెకు తెలియకుండానే దాదాపు రూ.5 లక్షలను ఆమె ఖాతా నుంచి పలుమార్లు విత్ డ్రా చేసుకున్నాడు. అయితే ఓ రోజు అతడు అందుబాటులో లేకపోవడంతో జూలియట్ బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్ డ్రా చేసింది. తన ఖాతాలోంచి డబ్బు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ పూర్తి చేసి ఎట్టకేలకు రిచర్డ్ ను అరెస్ట్ చేశారు. రెండు రోజులకే అతడు బెయిల్ పై విడుదలై.. జూలియట్ ఇంటికి వెళ్లి ఆమె ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని కోరాడు. ఆమె వినకపోవడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఇంటి లోపలి గడి పెట్టేసి, వేరే బిల్డింగ్ పైకి దూకి తప్పించుకున్నాడు. ఆమె మరణ వార్తను తెలుసుకున్న ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రిచర్డ్ పై అనుమానం ఉందని చెప్పడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే చేసిన దారుణాన్ని బయటపెట్టాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.