byసూర్య | Tue, Jan 19, 2021, 11:30 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న జీతాల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు సైతం ఈ అంశంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ ఆలస్యమైనా ఈ నెలాఖరుకు ఖచ్చితంగా సీఎం కేసీఆర్ నుంచి ప్రకటన రావడం ఖాయమని ఆయా సంఘాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిట్మెంట్ కూడా సంతృప్తికరంగా ఉంటుందని వారు తమను కలిసిన ఉద్యోగులకు చెబుతున్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నిన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి ఈ నెలాఖరు వరకు 11వ పీఆర్సీని ఇప్పిస్తామని అన్నారు. ఈ విషయమై ఉద్యోగులు ఆందోళన చెందొద్దని అన్నారు. అనవసరంగా తొందరపడి కొన్ని సంఘాలు ధర్నాలకు పిలుపునివ్వడం సరికాదన్నారు.