byసూర్య | Sun, Jan 17, 2021, 11:58 AM
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తండా గ్రామంలో దారుణం జరిగింది. సంతానం కలగలేదన్న కోపంతో భార్యపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడో కసాయి భర్త. దీంతో బాధితురాలి తల వెనుకభాగంలో బలమైన గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి ఆమెను జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహావీర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గనగర్ కి చెందిన చౌహన్ బండుతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం బిర్లాగొంది గ్రామానికి చెందిన చౌహన్ విజయకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లు సంసారం సాఫీగానే సాగింది. పిల్లలు కాలేదన్న సాకుతో రెండో పెళ్లి చేసుకుంటానని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాం నరసింహరెడ్డి వెల్లడించారు.