byసూర్య | Sat, Jan 16, 2021, 03:15 PM
సంపూర్ణ స్థాయిలో టెస్టింగ్ జరిగిన తర్వాతనే కోవిడ్ టీకాలకు ఆమోదం దక్కినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ల సమర్థతపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్ సమర్థతపై ప్రజలు తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేయవద్దు అన్నారు. విదేశాల్లో తయారైన మెడిసిన్ను మాత్రమే మనం మంచివని భావిస్తున్నామని, కానీ మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన భారతీయ మెడిసిన్ను గుర్తించడం లేదన్నారు. ఇలాంటి అంశాలను చర్చించడం సరికాదు అని కిషన్ రెడ్డి తెలిపారు. టెస్టింగ్ తర్వాతనే టీకాలకు ఆమోదం దక్కిందన్నారు. వ్యాక్సిన్లతో ప్రతి ఒక్కరికీ లాభం చేకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది.