byసూర్య | Sat, Jan 16, 2021, 01:06 PM
భూ సేకరణ నోటిఫికేషన్ జారీ తర్వాత భూమి కొన్నవారు పరిహారానికి అనర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. 2002లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం.. ఎమ్మార్ ప్రైవేట్ విల్లాల నిర్మాణం కోసం శేరిలింగంపల్లి మండలం, నానక్రాంగూడలో భూమిని సేకరించడాన్ని సవాల్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గుమ్మడి లక్ష్మీకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వేనంబర్ 17/ఏఏ లో ఉన్న తమ భూమికి పరిహారం చెల్లించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు హైకోర్టుకు వెల్లడించారు. జూన్ 9, 2003లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కిరణ్కృష్ణ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి 305 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశామని, అందుకు పూర్తి మొత్తం చెల్లించామని వెల్లడించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేశారని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ధర్మాసనం.. భూసేకరణ నోటిఫికేషన్ తర్వాత అసలు యజమానుల వద్ద భూమి కొనుగోలు చేసినందున ఈ పిటిషన్ విచారణార్హం కాదని స్పష్టంచేసింది. ఈ కేసులో 2002 జులైలో నోటిఫికేషన్ ఇస్తే 2003 జూన్ 13న భూమిని కొనుగోలు చేశారని ధర్మాసనం తెలిపింది. భూ సేకరణ నోటిఫికేషన్ తర్వాత భూమి కొనుగోలు చేసినందున పిటిషన్ విచారణార్హం కాదని స్పష్టం చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం డిపాజిట్ చేసిన పరిహారం గురించి అధికార వర్గాలను ఆశ్రయించడానికి పిటిషనర్కు అవకాశం కల్పించింది. ఈ మేరకు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.