byసూర్య | Sat, Jan 16, 2021, 11:27 AM
పెళ్లయిన 3 నెలలకే ఓ యువకుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీపేట మండల కేంద్రం సుభాష్ నగర్ కు చెందిన మిర్జా రజాక్(30) ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్. అయితే గత కొంతకాలంగా అతడు విద్యుత్తు అధికారుల వద్ద సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం స్థానికంగా ఓ వెల్డింగ్ దుకాణానికి గురువారం విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో.. సరిచేసేందుకు గానూ రజాక్ రూ.200కి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎల్సీ తీసుకుని స్తంభం ఎక్కగా.. స్తంభానికి పైన ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగలు అతడికి తగిలాయి. దీంతో రజాక్ మంటల్లో కాలిపోయి స్తంభానికే వేలాడుతూ ఉండిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికులు కిందకు దించి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. రజాక్ కు మహారాష్ట్రకు చెందిన ఆఫ్రిన్ బేగంతో 3 నెలల కిందటే వివాహమైంది. లైన్మెన్ శేఖర్ సమక్షంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. లైన్మెన్ నిర్లక్ష్యం వల్లనే రజాక్ మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.