byసూర్య | Fri, Jan 15, 2021, 01:46 PM
జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కరోనా టీకా వేసుకోవాలంటే ఎంత వయసుండాలి? ఎలా వేస్తారు? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ లు వేసుకొనేవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవానే దానిపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి.
ఏ వయసువారైనా టీకా వేసుకోవచ్చా?
18 ఏళ్ల లోపు వారిపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వ్యాక్సిన్ అవసరం లేదు. ఆపై వయసున్న ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవచ్చు. మొదట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, పోలీసులు తదితర విభాగాల సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత వృద్ధులకు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందజేస్తారు.
గతంలో కరోనా సోకిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలా?
కరోనా నుంచి కోలుకున్నవారు 90 రోజుల పాటు ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే వారి శరీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి వైరస్ సోకకుండా అడ్డుకుంటాయి. కనుక వ్యాక్సిన్ వేసుకోవాలో వద్దో వారే నిర్ణయించుకోవాలి
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
అన్ని దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్నాకే వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు వ్యాక్సిన్ వేసుకోవచ్చా?
జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నా వ్యాక్సిన్ వేస్తారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి వేయరు. అవయవ మార్పిడి చేసుకున్నవారికి ఎప్పటికీ వ్యాక్సిన్ వేయరు. కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసే సమయంలో పూర్తి మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి.
కరోనా రోగులకే వ్యాక్సిన్ వేస్తారా?
ఇది నిజం కాదు. కరోనా సోకకుండా అడ్డుకొనేందుకే టీకా వేస్తారు. కాబ్టటి వైరస్ సోకిన రోగులకు టీకా వేయరు.