byసూర్య | Fri, Jan 15, 2021, 08:44 AM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పండగ వేళ అందూ గాలిపటాలు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐతే పతంగులు ఎగురవేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో గాలిపటానికి ఓ నిండు ప్రాణం బలయింది. పతంగి ఎగురవేస్తూ ముషీరాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత బంగారు కృష్ణ మరణించారు. గురువారం కుటుం సభ్యులు, మిత్రులతో కలిసి ఓ భవనంపై గాలిపటం ఎగురవేశారు బంగారు కృష్ణ. పతంగిని చూస్తూ ముందుకెళ్లి.. ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కిందపడిపోయారు. నేరుగా ఇంటి గేట్ ఊచలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయన మరణించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పండగ వేళ పతంగులు ఎగురవేసే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. డాబాలపై గాలిపటాలు ఎగురవేసే క్రమంలో ఎంతో ప్రమాదవశాత్తు కింద పడిపోయి మరణిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జనగామలో ఓ యువతి భవనం మీద నుంచి పడిపోయింది. గాలిపటం ఎగరవేస్తూ..ఆ యువతి భవనం అంచుల దగ్గరకి వచ్చింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆమె ప్రాణాలతో బయటపడింది. అందుకే గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పిల్లలు గాలి పటాలు ఎగురవేస్తున్న సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
మరోవైపు గాలిపటాలకు కట్టే మాంజాతో ఏటా ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. మాంజాలు పక్షుల గొంతుకు చుట్టుకొని.. ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రతి పండక్కి పక్షులను బలితీసుకుంటున్నాయి. కేవలం పక్షులే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో మెడకు మాంజా చుట్టుకొని ఓ యువకుడు మరణించాడు. బైక్పై వెళ్తున్న సమయంలో మాంజా తగిలి.. గొంతు తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
పంతంగి మాంజాను గాజు పొడి, నైలాన్ దారంతో తయారు చేస్తున్నారు. వీటిని వాడడం వలన ఆ దారం చాలా పదునుగా ఉంటుంది. చైనా నుంచి ఇలాంటి మాంజాలు ఎక్కువగా దిగుమతి అవుంటాయి. గాలి పటాలు ఎగరవేసే సమయంలో ఈ మాంజా చుట్టుకొని పావురాలు, పిట్టలు మరణిస్తున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. జంతు హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఐతే మాంజా వినియోగంపై ఇప్పటికే చాలా రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రమాదరకరమైన చైనా మాంజాను వాడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐనా జనాలు పట్టించుకోకుండా ఇలాంటి పదునైన దారాలతోనే పంతగులు ఎగురవేస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు.