byసూర్య | Wed, Jan 13, 2021, 11:48 AM
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిలో పడ్డ కష్టాలు, బాధలు, వైరస్లను భోగి మంటల్లో అగ్ని దేవుడికి ఆహుతి చేసి, రాబోయే నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు.. ప్రగతి నిరోధకాలుగా మారాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంకావాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేసి సంక్రాంతిలో కాంతి లేకుండా చేశాయని విమర్శించారు. అయితే సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేసేందుకు, వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు, రైతు బీమా, రైతు బంధు పథకాలు, సమృద్ధిగా ఎరువులు, లాభాదాయక పంటల సాగులో సూచనలు, అనేక సబ్సిడీలు ఇస్తూ రైతుల ఇళ్లకు నిజమైన సంక్రాంతిని తీసుకువచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు చేసి వారు రోడ్డెక్కేలా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.