byసూర్య | Tue, Jan 12, 2021, 02:05 PM
నాగార్జున సాగర్లో బీజేపీ గెలవబోతుందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం జహిరాబాద్లో వివేక్ వెంకటస్వామి పర్యటించారు. బీజేపీ శ్రేణులు వివేక్ వెంకటస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో బీజేపీ విజయం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడుతోందని చెప్పారు. వరుస ఓటముల తర్వాత సీఎం కేసీఆర్కి తెలిసొచ్చిందని.. అందుకే పథకాలపై సమీక్షలు జరుపుతున్నారన్నారు. కరోనా సమయంలో ఆయుష్మాన్ భారతి పథకం ఉండుంటే ఎంతో మంది పేదవారికి ఉపయోగపడేదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్, అనుచరులు ఇంత కాలం దోచుకున్న డబ్బుని రాష్ట్ర ఖజానాకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. జహిరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతులకు బకాయిలు చెల్లించాలని కోరారు. జహిరాబాద్లో మున్సిపల్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ గెలుస్తుందనే ఇక్కడ ఎన్నికలు జరపడం లేదన్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో కేసీఆర్ విఫలం అయ్యారన్నారు. నిమ్జ్ భూ నిర్వాసితుల సమస్యను పట్టించుకోవాలని.. వారికి మార్కెట్ ధర ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.