byసూర్య | Tue, Jan 12, 2021, 01:58 PM
సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి నిషేధిత చైనా మాంజాను వినియోగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధించవొచ్చని పేర్కొంది. చైనా మాంజా అమ్మకం, కొనుగోళ్ల కట్టడిపై హైదరాబాద్లోని అరణ్యభవన్లో సోమవారం అటవీ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు. తెలంగాణలో చైనా, నైలాన్ మాంజాపై నిషేధముందని, అమ్మినా, కొనుగోలు చేసిన చట్టప్రకారం చర్యలు తప్పవని అటవీసంరక్షణ ప్రధానాధికారి ఆర్.శోభ హెచ్చరించారు. చైనా మాంజా అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం తెలిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.