byసూర్య | Tue, Jan 12, 2021, 12:47 PM
గ్రేటర్ హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందించనున్నారు.గ్రేటర్ పరిధిలోని రహ్మత్నగర్లోని ఎస్పీఆర్ హిల్స్లో ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇంటింటికి తిరిగి జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్కు రెండు రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చింది. తాను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు.. జల మండలి ముందు ధర్నా చేసేవారు. ప్రస్తుతం ఉచితంగా తాగునీరు అందించే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. ఇంటింటికి తిరిగి జీరో నీటి బిల్లులు ఇచ్చామని చెప్పారు. డిసెంబర్ నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ పరిధిలో 9 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఉచిత తాగునీటి పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. రహ్మత్నగర్లో దోబీఘాట్ కట్టిస్తామన్నారు. 2048 వరకు హైదరాబాద్లో తాగునీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 9,714 కోట్లతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించామని తెలిపారు.