byసూర్య | Tue, Jan 12, 2021, 08:30 AM
హైదరాబాద్ మహానగర పరిధిలో ‘ఫ్రీ వాటర్' కార్యక్రమం ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి రానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన హామి మేరకు ప్రతి ఇంటికి 20 వేల లీటర్లలోపు నీటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫ్రీ వాటర్ నీటిని పొందే వినియోగదారులు నల్లా కనెక్షన్, క్యాన్ నంబరు (క్యాన్) ఆధార్ నెంబరు లింకు చేయడంతో పాటు నల్లాకు నీటి మీటర్లను విధిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేటగిరీల వారీగా గైడ్లైన్స్లను జారీ చేసిన సర్కారు ఇందుకు మీ సేవా కేంద్రాలు లేదా WWW.HMWSSB. COM వెబ్సైట్ను సంప్రదించి ఆయా నల్లాలకు మార్చి 31లోగా విధిగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం జలమండలి ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించారు. అలా ఏర్పాటు చేసుకున్న వారికి 20 వేల లోపు నీటి వినియోగం ఉంటే నీటి సరఫరా ఉచితంగా ఉంటుంది. పథకం గురించి, అవసరమైన సేవలను అందించేందుకు వాటర్ బోర్డు ‘కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్' కేంద్రాలను ఏర్పాటు చేసింది. మేనేజ్మెంట్ వారు 155313 ఫోన్ నంబరులో అందుబాటులో ఉంటారు. ఆధార్ అనుసంధానం, మీటర్ల బిగింపు అనంతరం ఏప్రిల్ 1 తర్వాత నుంచి మంచినీటి బిల్లుల జారీ ఉంటుంది. 20వేల లోపు నీటి వినియోగం ఉన్న వారికే ఉచిత నీటి సరఫరా వర్తిస్తుంది.