byసూర్య | Mon, Jan 11, 2021, 05:41 PM
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ 100% విజయవంతమైందని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ లో అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం పలుశాఖలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా సత్వరం పరిష్కరించాలని, ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూములకు వెంటనే మ్యుటేషన్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి వారంలోగా పూర్తి చేయాలన్నారు. ఎన్నారైలు తమ పాస్ పోర్ట్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. గతంలో ఆధార్ నంబరు ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదు. అలాంటి వారికి మరోసారి అవకాశం ఇచ్చి, ఆధార్ నంబరు నమోదు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూమిని కూడా వెనువెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలి. ధరణి పోర్టల్ లో జీపీఏ, ఎస్పీఏ, ఏజీపీఏ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ అన్నారు.