byసూర్య | Mon, Jan 11, 2021, 11:16 AM
దేశంలో పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆనవాలు కనిపించడంతో ఆ వార్తల ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలపై కూడా పడుతోంది. తెలుగు రాష్ట్రాలను కూడా ఈ భయం వెంటాడుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఇక బర్డ్ ఫ్లూ వార్తలను మటన్ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ వార్తల కారణంగా మటన్కు డిమాండ్ ఏర్పడటంతో అమాంతంగా రేటును పెంచేశారు మటన్ వ్యాపారులు.
బర్డ్ ఫ్లూ.. పక్షుల్లో కనిపించే ఈ వ్యాధి ఒకప్పుడు దేశంలోని పౌల్ట్రీ రంగాన్ని కుదిపేసింది. ఆ సమయంలో కిలో చికెన్ ఏకంగా రూ.20కి కూడా అమ్ముడుపోయింది. కొనేవాళ్లు కొని ఎంచక్కా చికెన్ కూరను ఎంజాయ్ చేశారు. మళ్లీ కొన్నేళ్ల తర్వాత బర్డ్ ఫ్లూ లక్షణాలు కొన్ని రాష్ట్రాల్లో కనిపించాయి. దీంతో అక్కడ చికెన్కు గిరాకీ పడిపోయింది. ఇక చికెన్ ధరలు నేలచూపులు చూస్తుండటంతో మటన్కు క్రమంగా డిమాండ్ పెరిగింది.
బర్డ్ ఫ్లూ వార్తలు మటన్ వ్యాపారస్తులకు వరంగా మారాయి. చికెన్ ధరలు పడిపోవడంతో పాటు గుడ్లు ధరలు కూడా దిగిరావడంతో మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాదులో ఆదివారం రోజున చాలామంది మటన్ వ్యాపారులు కిలో మటన్ రూ.740కి అమ్మారు. ఇక ఖైమా అయితే కిలో రూ.840కి విక్రయించారు.గత వారం కిలో మటన్ రూ.700గా ఉన్నింది. బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో హైదరాబాదు నగరంలోని చాలా ప్రాంతాల్లో మటన్ ధరలను పెంచేశారు వ్యాపారస్తులు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే బోన్లెస్ మటన్ కిలో రూ.960కి అమ్మడం జరిగింది.