byసూర్య | Mon, Jan 11, 2021, 09:46 AM
హైదరాబాద్ : రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలుల జోరు పెరుగుతున్నది. దీంతో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి), కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలలో అత్యల్పంగా 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ బోథ్, తాంసి, గుడిహత్నూర్, నేరేడిగొండ, నిర్మల్ జిల్లా కుభీర్, ములుగు జిల్లా గోవిందరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపల్లి, సంగారెడ్డి జిల్లా కోహిర్, మంచిర్యాల జిల్లా జన్నారంలో 12.5 నుంచి 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. కానీ, మంగళవారం లేదా బుధవారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గవచ్చని వివరించారు.