byసూర్య | Sun, Jan 10, 2021, 01:11 PM
మహబూబాబాద్ : ఆమనగల్లులో విద్యుత్ షాక్తో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు. శనివారం దండెంపై బట్టలు ఆరేసేందుకు వెళ్లిన ఓ మహిళ విద్యుత్ షాక్ గురైంది. ఆమెను కాపాడబోయిన భర్తతో పాటు చూసేందుకు వెళ్లిన దంపతులు సైతం కరెంట్ షాక్తో మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలను మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించి, ఓదార్చారు. చిన్న పొరపాటుతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకువచ్చే శక్తి లేదని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై సీఎంఓ, ట్రాన్స్కో, జిల్లా అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. ట్రాన్స్కో నుంచి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రెండు కుటుంబాలకు రూ.20లక్షలు అందిస్తామని, అలాగే రైతుబీమా ద్వారా సాయం అందజేస్తామన్నారు. అలాగే ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలకు ఏ స్థాయిలో సహాయం చేయగలమో అంత మేరకు చేస్తామన్నారు. అలాగే మరిపెడలో ఒకరు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.