byసూర్య | Sat, Jan 09, 2021, 05:31 PM
వాట్సప్ కు పోటీగా ఓ యాప్ ముందుకు వచ్చింది. వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్పై యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించినట్టైతే యూజర్ల ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్కు తెలుస్తాయి. అంతేకాదు... ఆ వివరాలను ఫేస్బుక్తో పంచుకుంటామని కూడా వాట్సప్ తెలిపింది. ఒకప్పుడు యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చిన వాట్సప్, ఇప్పుడు ఆ ప్రైవసీ విషయంలో కొత్త రూల్స్ తీసుకురావడాన్ని యూజర్లు సహించలేకపోతున్నారు. అందుకే వాట్సప్కు ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్స్ను ఉపయోగించాలని నిర్ణయించుకుంటున్నారు. ప్రస్తుతం వాట్సప్కు ప్రత్యామ్నాయంగా రెండు యాప్స్ కనిపిస్తున్నాయి. ఒకటి టెలిగ్రామ్, రెండోది సిగ్నల్ యాప్.
గత రెండు మూడు రోజులుగా టెలిగ్రామ్, సిగ్నల్ మెసెంజర్ యాప్ డౌన్లోడ్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొత్త యూజర్ల సంఖ్య పెరుగుతోందని సిగ్నల్ ప్రకటించింది. నాన్ ప్రాఫిట్ సంస్థ అయిన సిగ్నల్ ఫౌండేషన్ రూపొందించిన ఎన్క్రిప్టెడ్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. సిగ్నల్ డౌన్లోడ్స్ ఎంతలా పెరిగిపోయాయంటే కొత్త అకౌంట్లకు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్స్ చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. డౌన్లోడ్స్లో వాట్సప్ని దాటిపోయినట్టు ట్విట్టర్లో ప్రకటించింది సిగ్నల్. సిగ్నల్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది. ఐప్యాడ్లో కూడా సిగ్నల్ యాప్ ఉపయోగించుకోవచ్చు. విండోస్, లైనక్స్, మ్యాక్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవచ్చు. 150 మందితో ఒకేసారి గ్రూప్ కాల్ చేయొచ్చు. అయితే ఇందులో బ్యాకప్ ఆప్షన్ లేకపోవడం మైనసే అని చెప్పొచ్చు. ఇంకోవిషయం ఏంటంటే ఇందులో మీ వివరాలను సిగ్నల్ స్టోర్ చేయదు.