byసూర్య | Sat, Jan 09, 2021, 04:15 PM
ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులోనే బంగారం ధరలు పతనం అయ్యాయి. ఒక్క రోజులోనే రూ.2,000 పైనే తగ్గింది గోల్డ్ రేట్. వెండి కూడా ఊహించని పతనాన్ని చూసింది. ఒక్క రోజులో రూ.6,000 పైనే వెండి రేటు తగ్గింది. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్-ఎంసీఎక్స్ లో ఫిబ్రవరి ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములపై 4.10 శాతం అంటే రూ.2,086 పతనమైంది. ప్రస్తుతం రూ. 48,818 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్లో మార్చి ఫ్యూచర్స్ కిలో వెండి ధర ఏకంగా 8.74 శాతం అంటే రూ.6,112 పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి రూ.63,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్లో బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం చాలా అరుదు. ఒక్కరోజులో బంగారం ధర రూ.2,000 పైన, వెండి ధర రూ.6,000 పైన పడిపోవడం మార్కెట్లో కలకలం రేపుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ బంగారం, వెండి ధరలు భారీగా పతనయ్యాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,851 డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.50 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.47,510 కాగా, 24 క్యారట్ బంగారం ధర రూ.51,810. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి లాంటి మెటల్స్ వైపు మొగ్గు చూపట్లేదు. దీంతో డిమాండ్ తగ్గి ధరలు దారుణంగా పతనమయ్యాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 10 ధర ఫిక్స్ చేసింది. జనవరి 11 నుంచి 15 వరకు గ్రాముకు రూ.5,104 చొప్పున గోల్డ్ బాండ్స్ ను ఆర్బీఐ అమ్మనుంది.