byసూర్య | Tue, Oct 20, 2020, 09:24 AM
మహబూబాబాద్ జిల్లా కేంద్రం కృష్ణ కాలనీలో నివాసముండే కుసుమ రంజిత్ పెద్దకుమారుడు దీక్షిత్రెడ్డి(9)ని ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి అపహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆడుకోవడానికి వెళ్లిన కుమారుడు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి దీక్షిత్ను తీసుకెళ్లాడని అతడితో ఆడుకున్న మిత్రుడు భువనచంద్ర చెప్పాడు. కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడి తల్లి వసంత ఫోన్కు రాత్రి 9.45కి ఇంటర్నెట్ కాల్ చేసి రూ.45 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అనంతరం రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదివారం రాత్రి బాలుడిని కిడ్నాప్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే 10 బృందాలను రంగంలోకి దించి 100 మంది పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ అయిదు సార్లు బాలుడి తల్లి ఫోన్కే ఇంటర్నెట్ కాల్ చేశాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అగంతకుడు ఫోన్ చేసినప్పుడు బాలుడి తండ్రి రంజిత్ ‘తన వద్ద రూ.2 లక్షలే ఉన్నాయని తెలపగా.. ఇటీవల రూ.45 లక్షల పెట్టి కొనుగోలు చేసిన ఫ్లాట్ను అమ్మి ఇవ్వొచ్చు కదా’ అంటూ ఫోన్ కట్ చేశాడు. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పిన కిడ్నాపర్ ఫోన్ చేయకపోవడంతో తలిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అగంతకుడు తెలివిగా ఇంటర్నెట్ కాల్ చేస్తుండటంతో అతన్ని కనుగొనేందుకు డీజీపీ కార్యాలయాన్ని సంప్రదించారు. తమ బాబుకు ఎలాంటి హాని తలపెట్టవద్దని కిడ్నాపర్ను బాలుడి తల్లిదండ్రులు వేడుకున్నారు. వారు అడిగినంత డబ్బు తమ దగ్గర లేదని..బాబును వదిలిపెట్టాలని తల్లి వసంత బోరున విలపించారు.