byసూర్య | Fri, Oct 16, 2020, 11:36 AM
దేశంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిర్భయ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, షీ టీంల లాంటి ఎన్ని చర్యలను ప్రభుత్వాలు తీసుకువస్తున్నా దుర్మార్గుల తీరులో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి ముగ్గురు యువకులు దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థిని అపస్మారక స్థితికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఓ 19 ఏళ్ల యువతి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. సికింద్రాబాద్ లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆ యువతికి తమ ఇంటి సమీపంలో నివాసముండే రాములు, జోసెఫ్, నవీన్ రెడ్డి ముగ్గురు స్నేహితులుగా మారారు.
ఈ నెల 5 వ తేదీన ఆ యువతి ఫీజు కట్టేందుకు కాలేజీకి వెళ్లింది. ఆ సమయంలో జోసెఫ్ ఆమెకి ఫోన్ చేశాడు. ఈ రోజు తన పుట్టిన రోజని నవీన్, రాములతో కలిసి పార్టీ చేసుకుందామని చెప్పడంతో ఫ్రెండ్సే కదా అన్న నమ్మకంతో ఆమె ఒప్పుకుంది. అనంతరం ఆ ముగ్గురు కలిసి హెటల్ కు వెళ్లి బిర్యానీ పార్శిల్ తీసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కేబీహెచ్ బీలోని ఓ లాడ్జికి వెళ్లారు. అయితే ముందస్తుగా అనుకున్న ప్లాన్ ప్రకారం బయటకు వెళ్లి కేక్ తెచ్చిన నవీన్ దానిపై మత్తు మందు చల్లాడు.
ముందుగా నువ్వే తినాలంటూ మాయమాటలు చెప్పి ఆ యువతికి మత్తు కలిపిన ఆ కేక్ ను తినిపించారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆ ముగ్గురు యువకులు ఆ యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన యువతిని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి ఆటోలో ఇంటికి పంపించారు. అయితే ఆరోజు నుంచి యువతి ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో ఈ నెల 11న బాధితురాలు కోమాలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. బుధవారం రాత్రి బాధితురాలి తల్లి దండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.