byసూర్య | Thu, Oct 15, 2020, 09:09 AM
వరుసగా మూడు రోజుల పాటు బీభత్సం సృషిస్తూ ఏకధాటిగా కురిసిన వానలు తగ్గనున్నాయి. తెలంగాణపై కొనసాగిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా 25 కిలోమీటర్ల వేగంతో అరేబియా సముద్రంవైపు కదులుతున్నది. అది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారి నార్త్ ఇంటీరియర్ కర్నాటక, మధ్య మహారాష్ట్రవైపు కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ద్రోణితో, ఈ అల్పపీడనం కలిసే అవకాశం ఉందని వెల్లడించారు. అదే జరిగితే వేగం పుంజుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం వైపు వెళ్లే కొద్దీ తీవ్రత పెరుగుతుందన్నారు. ఈ నెల 16 నాటికి మరోసారి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వివరించారు. అది తిరిగి తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు ఉండబోవని, మహారాష్ట్ర, కొంకణ్, గోవా, కర్నాటకలో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని నాగరత్న పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో గురువారం, శుక్రవారం చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆమె తెలిపారు. ఇక, బుధవారం అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా దోమకొండలో 5.1 సెంటీమీటర్లు, గాంధారిలో 3.8 సెంటీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 3.3 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం తిమ్మారావుపేటలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి, గండిపేటల్లో 2.5 సెంటీమీటర్ల వానపడింది. ఇదిలా ఉండగా, ఈసారి వరుసగా వచ్చిన అల్పపీడనాలతో నైరుతి వర్షాలు సమృద్ధిగా కురిశాయని నాగరత్న తెలిపారు. వర్షాకాలాన్ని గత నెల 30 వరకే అధికారికంగా లెక్కిస్తామని, అయితే బంగాళాఖాతంలో ఈ 14 రోజుల్లోనే రెండు అల్పపీడనాలు వరుసగా ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయని పేర్కొన్నారు.