byసూర్య | Mon, Oct 12, 2020, 05:15 PM
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. అనేక మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కరోనా కట్టడి కోసం అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి.
చలికాలంలో ఈ వైరస్ను అదుపు చేయడం మరింత కష్టమవుతుందని జుర్జెన్ రిచ్ట్ అనే ఆస్ట్రేలియా శాస్త్రవేత్త తెలిపారు. చల్లటి వాతావరణంలో వైరస్ ఎక్కువకాలం జీవించి ఉంటుందని నిర్ధారించారు. ముఖ్యంగా మొబైల్ స్క్రీన్, గాజు పరికరాలు, కరెన్సీ నోట్లపై ఈ వైరస్ 28 రోజుల వరకు జీవించి ఉంటుందంటూ బాంబు పేల్చారు. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని ఉపరితలాలపై వైరస్ ఒక రోజు కన్నా ఎక్కువగా జీవించలేదని అయితే అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే మొబైల్ ఫోన్లు, సూపర్మార్కెట్ సెల్ఫ్ సర్వ్ చెక్అవుట్లు, బ్యాంక్ ఎటిఎంలు, ఎయిర్పోర్ట్ చెక్ఇన్ల వద్ద వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. అలాగే కరెన్సీ నోట్లు ఒకరి చేత నుంచి మరొకరికి మారేకొద్దీ వైరస్ వారందరికి సోకే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు శీతల వాతావరణంలో వైరస్ ఐదు రెట్లు బలంగా ఉంటుందని వైరాలజిస్ట్ జుర్జెన్ రిచ్ట్ తెలిపారు.