byసూర్య | Mon, Oct 12, 2020, 02:58 PM
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ఆమె గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తన గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.
మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అబద్దపు మాటలు చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారని... అయినా ప్రజలు వారిని నమ్మలేదని అన్నారు. విపక్షాల అబద్దాలకు బదులుగా కవితకు విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. మరోసారి న్యాయం గెలిచిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలో కవితకు 728 ఓట్లు పడ్డాయి. ఈ నెల 14న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు.