byసూర్య | Mon, Oct 12, 2020, 10:21 AM
ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్(87) కన్నుమూశారు. 1933లో మైసూర్ శివరాంపేట్లో జన్మించిన రాజన్.. సోదరుడు నాగేంద్రతో కలిసి పలు ప్రముఖ చిత్రాలకు సంగీతం అందించారు. వీరి ద్వయంలో వచ్చిన ఆల్బమ్స్ అన్నీ హిట్టే. రాజన్- నాగేంద్ర ద్వయంగా పాపులర్ అయిన వీరు 37 సంవత్సరాల పాటు సంగీత సేవలు అందించారు.
తెలుగుతో పాటు కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించిన రాజన్ నాగేంద్ర 60కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. అగ్గి పిడుగు, పూజ, ఇంటింటి రామాయణం, నాలుగు స్తంభాలాట, పంతులమ్మ, మూడుముళ్ళు, ప్రేమ ఖైదీ, సొమ్మొకడిది సోకొకడిది, రెండు రెళ్ళు ఆరు, నాగమల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగలు, ఆడపడుచు, రౌడీ పోలీస్ సీత పుట్టిన దేశం, అప్పుల అప్పారావు, చూపులు కలిసిన శుభవేళ, వయ్యారి భామలు వగలమారి భర్తలు తదితర చిత్రాలకు రాజన్ సంగీతం అందించారు. ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.