byసూర్య | Sun, Oct 11, 2020, 12:37 PM
హైదరాబాద్ శివారులో కొన్ని నెలలుగా ఓ చిరుత అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి రాజేంద్రనగర్ వాలంతరి రైస్ రిసెర్చ్ సెంటర్ సమీపంలోనూ చిరుత రెండు లేగ దూడలను చంపడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో ఆ చిరుత కోసం వెతికారు.
చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చనిపోయిన దూడలను ఎరగా అక్కడ ఉంచారు. దీంతో గత అర్ధరాత్రి ఆ చిరుత పశువుల పాక వద్దకు వచ్చి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో తమకు ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. చిరుతను పట్టుకున్న అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని జూపార్కుకు తీసుకెళ్లారు.