byసూర్య | Sat, Oct 10, 2020, 04:10 PM
తెలంగాణ కేబినెట్ భేటీ ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ భేటీలో భాగంగా పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. ఈనెల 13, 14 న అసెంబ్లీ సమావేశాలని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై కేబినెట్ చర్చించనున్నది. మరీముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ బిల్లు సవరణపై చర్చించనున్నారు. ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించే అంశంపై కూడా నిశితంగా చర్చించనున్నారు. 2016 గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్ల అమలు, గ్రేటర్ ఎన్నికల నిర్వహణ, ఎన్నికల తేదీల నిర్ణయం ఇక ప్రభుత్వానిదే అనేదానిపై భేటీలో చర్చించనున్నారు.
కాగా.. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలుపై సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి..? ఏ పంట వేయొద్దు..? ఏ పంట వేస్తే లాభం..? నష్టం..? తదితర అంశాలపై సమీక్షలో చర్చించనున్నారు. కేంద్రం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై కేసీర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. వర్షాకాలం పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు 6 వేల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.