byసూర్య | Sat, Oct 10, 2020, 03:36 PM
మనుషుల చర్మంపై కరోనా వైరస్ 9 గంటల దాకా బ్రతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది. ఇన్ ఫ్లూయెంజా ‘ఏ’వైరస్ (ఐఏవీ)తో సహా ఇతర వైరస్లు 2 గంటల్లోపే నాశనమవుతుండగా, కోవిడ్ కారక సార్స్–సీవోవీ–2 మాత్రం 9 గంటల పాటు జీవించి ఉంటుందని జపాన్ కు చెందిన పరిశోధన సంస్థ తాజాగా స్పష్టం చేసింది. ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఎక్కువేనని హెచ్చరించింది. సార్స్–సీవోవీ–2 వైరస్ వ్యాప్తి నిరోధానికి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరమని పేర్కొంది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని సూచించింది.
సాధారణ ఫ్లూ వైరస్తో పోలి్చతే కరోనా వైరస్ మనుషుల చర్మంతో సహా వివిధ ఉపరితలాలపై దీర్ఘకాలం చురుకుగా ఉంటున్నట్లు తేల్చారు. అయితే చర్మంతో పోలిస్తే స్టీలు, గాజు, ప్లాస్టిక్ వంటి వాటిపై త్వరగా నశిస్తోందన్నారు. అంతేకాదు చర్మంపైన ఉండే వైరస్కు లాలాజలం, చీమిడి, చీము.. లాంటివి తోడైతే కరోనా వైరస్ 11 గంటల పాటు సజీవంగా ఉంటుందని తేల్చారు. జపాన్ క్యోటో పర్ఫెక్చురల్ వర్సిటీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన తాజా పరిశోధన అంశాలు ఆక్స్ఫర్డ్ అకడమిక్, ద జర్నల్ క్లినికల్ ఇనెఫెక్షియస్ డిసీజెస్ల్లో ప్రచురితం అయ్యాయి. పోస్ట్మార్టం చేసిన శవాల నుంచి సేకరించిన చర్మంపై ఈ అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా శరీరంలోని ఇతర అవయవాలతో పోల్చితే చర్మం నెమ్మదిగా క్షీణిస్తుంది. అందుకే చనిపోయి ఒకరోజు గడిచిన మృతదేహాల నుంచి సేకరించిన చర్మంపై ఈ పరిశోధనలు జరిపారు.