byసూర్య | Fri, Oct 09, 2020, 01:36 PM
రేషన్ బియ్యంలో యూరియా కలిసి రావడంతో పేదలు ఆందోళనకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, మర్కగూడ గ్రామంలోని చౌకధరల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మర్కగూడ కొలాన్ గిరిజనులకు 3 వందల క్వింటాళ్లను పంపిణీ చేశారు. అయితే వంట చేసుకునేందుకు మహిళలు బియ్యం కడుగుతుండగా అందులో యూరియా గులికలు కనిపించాయి. స్థానికులు రేషన్ దుకాణానికి చేరుకుని డీలర్ను నిలదీశారు. అయితే తనకేమీ తెలియదని తనకు వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నానని చెప్పారు.
దీంతో బియ్యం పంపిణి నిలిపివేశారు. అప్పటికే బియ్యం తీసుకువెళ్లినవారు వంట చేసుకోవద్దని సమాచారం ఇచ్చారు. ఈ మేరకు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బియ్యాన్ని పరిశీలించారు. యూరియా ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.