byసూర్య | Thu, Oct 08, 2020, 02:43 PM
వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది.మంత్రివర్గ ఉపసంఘంలో ఈటల రాజేందర్ గారి అధ్యక్షతన పాల్గొన్న మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు.
ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ 365 రోజులు నిరంతరం పనిచేసే శాఖ అని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్లకు మాత్రమే పరిమితమైతే, కోవిడ్ సందర్భంగా మా శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయ్యింది అని తెలిపారు. కరోనా ప్రభావం వలన వైద్య శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది అని, ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖని బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆ దిశగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. . కోవిడ్ సందర్భంగా పనిచేసిన ప్రతి ఒక్క వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పని చేసిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
గత ఆరేళ్లుగా వైద్యారోగ్య శాఖ అద్భుతంగా పని చేస్తూ.. ఎన్నో విజయాలు సాధించిందని మంత్రి కొనియాడారు. మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం నుంచి మొదలుకొని డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు, ఆసుపత్రుల్లో ఐసియు యూనిట్స్ ఏర్పాటు, బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలను నిర్వహించింది అని అన్నారు. కరోనా సందర్భంగా మెడికల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పని చేయడం వల్లే ఈ సారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయని చెప్పారు. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగిందన్నారు. ఇతర రాష్ర్టాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.